1. హృద్యంబై, కమనీయమై, మధురమై, యుత్సాహ సంయుక్తమై
సద్యోజాత చమత్కృతీ భరితమై, సంపూర్ణ ధారాళమై
ఉద్యద్దారణ ప్రౌఢిమాసగుణమై, ఓజోగుణోపేతమై
ఆద్యంతంబలరించె మోహనునిదౌ అష్టావధానమ్మిటన్ !
2. ప్రాచీనాధునికాంధ్ర కావ్యగత సారంబున్ మదింగ్రోలి, త
ద్రోచోరాజిత ‘ధార’ యాశు కవితా రూపాన తోడుండగా
వాచాంబోధి సరస్వతీ సుతుడుగా భాస్వంత సత్కీర్తియై
ఆచార్యోత్తమ పీఠిపై నిలచె తా నష్టావధానమ్ముచే !
3. గురుకృప హేతువై నిలువ కూరిమి నేర్చిన పద్య విద్యతో
మరియొక ’విశ్వనాధ’ యన మాన్యత కగ్గగు యశుధార తో
వరుస శతావధానముల ప్రాభవమందిన మేడసాని లో
’తిరుపతి-వేంకటేశ్వరుల’ తేజము నిండెననంగ జెల్లదే !
4. ఆవనజాక్షి సత్కృపను ఆంధ్రులదౌ నవధాన విద్య లో
భావనె, అబ్భురంబనగ పంచ సహస్రము చేసినట్టి, పుం
భావ సరస్వతీ విపుల వైభవ మానిన భాగ్యసీమ, తా
పావనమయ్యె మోహనుని పద్యసభారసగాంగధారలోన్ !
5. కూరిమి పృచ్చకావళులు కోరిన వెంటనె పద్య మాలికల్
నేరుపు మీర పూరణలు స్నేహపురస్సర కావ్య భాష లో
ధారలు ధారలై కురిసె , ధన్య చరిత్రుడు , వానిదౌ అసా
ధారణ ధారణా ప్రతిభ దైవ కృపన్ విలసిల్లు గావుతన్.
6. అదియ పుంభావ శారద యాకృతనగ
మధుర మంజుల స్వర్ధ్హునీ మహిత కలిగి
సత్య లోకమ్ము నందుండి జాలువారి
మేదినీ స్థలి పుట్టె నీ ’మేడసాని’ !